ఏపీ పోలిటిక్స్లో రాజకీయ వారసులకు కొదవేమీ లేదు. ఇప్పుడు ఇదే కోటాలో మరో నేత రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఆమె ఎవరో కాదు.. దివంగత వంగవీటి మోహనరంగా కుమార్తె.. ఆశా కిరణ్. ఇప్పటికే ఆమె సోదరుడు రాధాకృష్ణ పోలిటిక్స్లో ఉన్నారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలేవీ లేకపోయినా.. సరైన సందర్భం కాకపోయినా.. ఇప్పుడు సడన్గా రంగా కుమార్తె ప్రజల్లోకి రావడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది. అమె ఎవరు వదిలిన బాణమో.. ఎవరి మీదకు గురిపెడతారో.. అనే విషయంపై ఇప్పటికే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న విశాఖలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆశా కిరణ్ ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు, అభిమానులు ఈ సభకు రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతానికి తాను రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. రానున్న మూడేళ్లు రాధా రంగా మిత్రమండలి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెబుతున్నారు.
ఆ తర్వాతే రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకొంటానని ప్రకటించారు. ఆమె ప్రకటనలు ఎలా ఉన్నా.. రంగా కుమార్తె పొలిటికల్ ఎంట్రీ వెనుక వైసీపీ రాజకీయం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే రంగా కుమార్తెను వైసీపీ చేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వంగవీటి రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్ ఇప్పుడు ఫ్యాన్ పార్టీలోనే ఉన్నారు.
రంగాను హత్య చేసిన వారిని పార్టీలో ఉంచుకొని.. అదే పార్టీకి రంగా అభిమానులు సపోర్ట్ చేయాలని అడిగితే.. పబ్లిక్ నుంచి పాజిటివ్ రియాక్షన్ అయితే రాదు. ఇక ఏపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ ఓటర్లు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ద్వారా ఆ సామాజిక వర్గం ఓట్లర్ల సపోర్టు పొందాలనే ప్రయత్నం చేశారు.
అయితే కాపులు ముద్రగడను అస్సలు పట్టించుకోలేదు. వచ్చే ఎన్నికల నాటికి కాపులను వైసీపీకి అనుకూలంగా మార్చుకోలేకపోతే.. ఆ పార్టీకి మళ్లీ ఓటమి తప్పదు. కానీ పవన్ కళ్యాణ్ను కాదని కాపులు రంగా కుమార్తెకు జైకొట్టే అవకాశాలు తక్కువ. అందుకే కాపులు వైసీపీకి సపోర్ట్ చేయకపోయినా.. కనీసం వారిని టీడీపీకి వ్యతిరేకంగా మార్చడం వైసీపీ టార్గెట్గా కనిపిస్తోంది. వంగవీటి రంగా కుమార్తెను వైసీపీలో చేర్చుకోకుండా.. తటస్థంగా ఉంచడం ద్వారా.. కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయొచ్చు. డిసెంబర్ 26 సభలో రంగా కుమార్తె మాటల ద్వారా ఆమె అసలు ఉద్దేశం బయటపడే అవకాశం ఉంది.
