ఉక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగడంతో భారతీయ నావికుడు మృతి చెందిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని యమునానగర్ జిల్లాకు చెందిన గుర్ప్రీత్ సింగ్ బాత్ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు, షిప్పింగ్ సంస్థ ధృవీకరించాయి.
జూలై 19న ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో “గోల్డెన్ లియో” అనే వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, గుర్ప్రీత్ సింగ్ బాత్ కూడా వారిలో ఒకరు. దాడిలో ఆయన మృతి చెందినట్లు షిప్పింగ్ సంస్థ సోమవారం మధ్యాహ్నం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది.
గుర్ప్రీత్ తండ్రి కీర్తన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, గుర్ప్రీత్ తమకు ఏకైక కుమారుడు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఆయన వివాహం కాగా, ప్రస్తుతం భార్యతో పాటు ఆరు నెలల చిన్న కుమార్తె ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
గుర్ప్రీత్ స్వగ్రామమైన పంజేటోన్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గుర్ప్రీత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అవసరమైన సహాయం అందించాలని కోరారు. ఈ ఘటనపై భారత అధికారులు, సంబంధిత దౌత్య కార్యాలయాలు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
