జమ్మూ కశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో మంగళవారం అమర్నాథ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుంచి జారిపడిన ఘటనలో కనీసం 39 మంది యాత్రికులు గాయపడ్డారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అధికారుల వివరాల ప్రకారం, వేగంగా వెళ్తున్న బస్సు పదునైన మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డుపై నుంచి జారి సమీపంలోని ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఆ ఇంటికి తీవ్ర నష్టం వాటిల్లింది.
అయితే బస్సు ఇంటిని ఢీకొనడం వల్ల అది సమీపంలోని సింధ్ నదిలోకి దూసుకెళ్లకుండా ఆగిపోయింది. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు.
పవిత్ర అమర్నాథ్ గుహలో దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న యాత్రికులే ఈ బస్సులో ప్రయాణిస్తున్నట్లు వెల్లడైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
ఈ ఘటనపై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందించి, గాయపడిన యాత్రికుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
