దేశంలో ఎల్పీజీ సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాపై కొంత ఆందోళన ఉన్నప్పటికీ దేశీయ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ తెలిపారు.
భారతదేశం తన అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్లో సుమారు 60 శాతం దిగుమతి చేసుకుంటుందని ఆమె చెప్పారు. అందులో దాదాపు 90 శాతం సరఫరా హోర్మోజ్ జలసంధి ద్వారా వస్తుందని వివరించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల కొంత సవాలుతో కూడిన పరిస్థితి ఏర్పడినప్పటికీ దేశీయ వినియోగదారులకు సరఫరా అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 50 లక్షల ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు పంపిణీ చేస్తున్నామని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం పంపిణీ వ్యవస్థలో ఎక్కడా గ్యాస్ పూర్తిగా అయిపోయిన పరిస్థితి లేదా సరఫరా నిలిచిపోయిన ఘటనలు నమోదుకాలేదని స్పష్టం చేశారు.
అయితే అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ప్రజల్లో కొంత ఆందోళన ఏర్పడడంతో గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ భారీగా పెరిగినట్లు తెలిపారు. భయంతో అవసరానికి మించి బుకింగ్లు చేయడం వల్ల పంపిణీపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు అనవసరంగా పానిక్ బుకింగ్లు చేయకుండా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఇక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. గ్యాస్ అవసరం ఎక్కువగా ఉన్న లబ్ధిదారుల జాబితాను గుర్తించి వారికి ప్రాధాన్యంగా సిలిండర్ల సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్లు వెల్లడించారు.
ముఖ్యంగా గృహ వినియోగ సిలిండర్లతో పాటు వాణిజ్య సిలిండర్ల సరఫరా కూడా అంతరాయం లేకుండా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ దేశంలో ఎల్పీజీ సరఫరా నిలిచిపోదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
