తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన వెంటనే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి కాల్ చేసిన తర్వాత సీన్ మారిందిని వైఎస్ సునీత ఆరోపించారు. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ బాధ్యతగా విచారణ జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం కడపలో వైఎస్ సునీత విలేకర్లతో మాట్లాడుతూ ఈ హత్య కేసులో కీలక నిందితులు చెప్పిందే వినడమే తప్ప వారిని లోతుగా సీబీఐ విచారించ లేదన్నారు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ల సంభాషణ గురించి సీబీఐ సీరియస్గా తీసుకొని విచారించడం లేదని ఆమె పెదవి విరిచారు.
తన తండ్రి హత్య జరిగిన తరువాత నిందితులందరి మధ్య ఫోన్ సంభాషణలు, మెసేజ్లు అత్యధికంగా జరిగాయని ఆమె గుర్తు చేశారు. ఇంకా ఏమైనా ఇతర ఆధారాలు ఉంటే ఇవ్వండని అడిగితే తన వద్దనున్న అదనపు ఆధారాలను సైతం కోర్టుతో పాటు సీబీఐకి సమర్పించానని చెప్పారు.
వాటిపై సైతం లోతుగా విచారణ జరపలేదన్నారు. ఈ హత్య కేసులో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్తోపాటు ఆయన భార్య వైఎస్ భారతిని సైతం విచారించాల్సి అవసరం ఉందని కుండబద్దలు కొట్టారు. కాని వారిని సీబీఐ విచారించలేదన్నారు.
ఈ స్థాయిలో పోరాడుతున్నా కూడా తనకు చివరకు న్యాయం జరగలేదని చెప్పారు. మన దేశంలో వ్యవస్థలన్నీ ఇలానే ఉన్నాయని పేర్కొన్నారు. చాలా బాధగా ఉందని, తన పోరాటం ఇంతటితో ఆగదని తెలిపారు. ఈ పోరాటం చివరి వరకు కొనసాగిస్తానంటూ వైఎస్ సునీత స్పష్టం చేశారు.
