తెలంగాణ రాజకీయాల్లో డ్రగ్స్ అంశంపై మరోసారి వేడి చర్చలు మొదలయ్యాయి. మండలిలో జరిగిన చర్చల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ సమస్యపై ప్రతిపక్షాన్ని నిలదీస్తూ, “డ్రగ్స్ టెస్ట్కు సిద్ధమేనా?” అంటూ ప్రత్యక్ష సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను డ్రగ్స్ పరీక్షకు తీసుకురావడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కూడా డ్రగ్స్ టెస్ట్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇంకా ముందుకెళ్లి, తమ పార్టీ బి-ఫారం ఇచ్చిన ప్రతి అభ్యర్థిని డ్రగ్స్ పరీక్షలకు హాజరుపరచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అదే విధంగా ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులను పరీక్షలకు తీసుకురాగలవా అని ప్రశ్నించారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విస్తృతి పెరిగిందని, యువత మత్తుకు బానిస అయ్యే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
బ్రీత్ అనలైజర్ పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేసిన వారు, డ్రగ్ అనాలసిస్ విషయంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని నిలదీశారు. డ్రగ్స్ అంశం ఎక్కడ ప్రస్తావనకు వచ్చినా కొన్ని పేర్లు ముందుకు వస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
