ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు వారికి సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈ కార్యక్రమం దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా రూపొందించారు. సమాజంలో వారికి మరింత భాగస్వామ్యం కల్పించేందుకు, రోజువారీ జీవనంలో ఎదురయ్యే రవాణా సమస్యలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు పూర్తిగా ఉచిత ప్రయాణం అందించనున్నారు. మొత్తం 21 వర్గాల్లో 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఈ సదుపాయానికి అర్హులు. అదనంగా, సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మంది లబ్దిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు రూ.207 కోట్ల వ్యయం చేయనుంది. దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం సామాజిక సమానత్వానికి దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు “దివ్యాంగ శక్తి” పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పథకం ప్రారంభోత్సవంలో భాగంగా మంగళగిరి బస్టాండ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు.
ఈ ప్రయాణం మంగళగిరి నుంచి పెనుమాక వరకు సుమారు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించిన నేతలు, వారి సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత దివ్యాంగులకు అందుతున్న సేవలపై ప్రత్యక్షంగా స్పందనలు సేకరించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు హాజరయ్యారు. దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన ఈ పథకం సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
