పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు (131వ రాజ్యాంగ సవరణ బిల్లు) ఆమోదం పొందకపోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు చెప్పారు. నారీ శక్తికి సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ, విపక్షాల తీరు వల్ల అది సాధ్యం కాలేదని ఆయన పేర్కొన్నారు.
బిల్లు వీగిపోవడంపై తీవ్రంగా స్పందించిన ప్రధాని, ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మహిళల కలలను కాలరాశాయని ఆరోపించారు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలు మహిళా సాధికారతకు అడ్డుపడుతున్నాయని, వారిని రాజకీయంగా ఎదగనీయకుండా చేస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తూనే, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ బిల్లును అడ్డుకున్న వారికి మహిళా లోకం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో తమ ప్రభుత్వం వెనక్కి తగ్గదని మోదీ స్పష్టం చేశారు.
