మమత పార్టీకి మరో పెద్ద రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ బుధవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆమె త్వరలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి తిరిగి రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
ఈ పరిణామం టీఎంసీలో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు. ఇటీవలే పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేసి తిరుగుబాటు స్వరం వినిపించారు. ఇప్పుడు సుష్మితా దేవ్ రాజీనామాతో ఆ సంక్షోభం మరింత తీవ్రంగా మారినట్లు కనిపిస్తోంది.
సుష్మితా దేవ్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ఆమె తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లో ఎదిగారు. అసోంలోని శిల్చార్ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాంగ్రెస్ను వీడి టీఎంసీలో చేరి కీలక నాయకురాలిగా గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా, టీఎంసీలో అంతర్గత విభేదాలు మరింత పెరుగుతున్నాయనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సుమారు 20 మంది లోక్సభ సభ్యులు కూడా పార్టీని వీడి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అదే పరిస్థితి రాజ్యసభలో కూడా నెలకొనే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాజ్యసభలో టీఎంసీకి 13 మంది సభ్యులు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు లభిస్తే విడిపోయిన వర్గానికి చట్టబద్ధ గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం తొమ్మిది మంది సభ్యులు విడిపోతే టీఎంసీకి పెద్ద దెబ్బ తగలవచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే టీఎంసీకి చెందిన మరికొందరు ప్రముఖ ఎంపీలు కూడా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యూసుఫ్ పఠాన్, శత్రుఘ్న సిన్హా పేర్లు రాజకీయ చర్చల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ వెలువడలేదు.
