బాలరాముడిని కొల్లగొట్టిన కేసులో ఇప్పటికి అందరినీ అరెస్టు చేశారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్లో పేరున్న మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీనియర్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. విరాళాల దుర్వినియోగ ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికలో చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు.
ఎఫ్ఐఆర్లో పేరున్న వారంతా ఆలయానికి వచ్చిన నగదు, విలువైన వస్తువుల లెక్కింపు ప్రక్రియలో పనిచేసిన వారేనని అధికారులు తెలిపారు. వారందరినీ గురువారం రాత్రి అయోధ్యలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. విచారణ అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని ఉద్యోగి లేదా సేవకుడు యజమాని ఆస్తిని అపహరించడం, నమ్మకద్రోహం, దొంగిలించిన ఆస్తిని తెలిసి స్వీకరించడం, నేరపూరిత కుట్ర తదితర నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.
