ఆంధ్రప్రదేశ్ లో బచ్చలకూర జోసఫ్ అనే యూట్యూబర్ పై ఉపా చట్టం కింద కేసు నమోదై చర్చనీయాంశమైన ఈ సమయంలో మరో వ్యక్తిపై కూడా ఇదే చట్టం కింద పోలీసులు కేసుపెట్టారు. సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్న కేరళకు చెందిన 26 ఏళ్ల మహమ్మద్ సనీఫ్పై అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) (ఉపా చట్టం) కింద కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గత ఏడాది పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి మద్దతునిస్తూ సనీఫ్ వీడియోలు చేశాడు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ పై తీవ్ర విమర్శలు చేశాడు. పహల్గామ్ దాడిలో మరణించిన ఓ మలయాళీ బాధితుడి కుమార్తె సనీఫ్ పై కేసు దాఖలు చేసింది. సామాజిక మాధ్యమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఉగ్రదాడిని సమర్థించేలా, దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించి భారతీయ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అదీనా భారతి ముట్టం పోలీస్ స్టేషన్లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఆమె తన ఫిర్యాదుతో పాటు సామాజిక మాధ్యమ వ్యాఖ్యల చిత్రాలను (స్క్రీన్షాట్లు) కూడా పోలీసులకు అందజేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తు అనంతరం సనీఫ్ సనూఫ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆయనపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. అనంతరం జూలై 4న సౌదీ అరేబియా నుంచి కేరళలోని కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు, కరిపూర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తరువాత విచారణ కోసం ఆయనను ముట్టం పోలీసులకు అప్పగించారు.
ప్రాథమిక విచారణలో ఆయన మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను పరిశీలించిన పోలీసులు మరిన్ని అభ్యంతరకర డిజిటల్ ఆధారాలు లభించాయని తెలిపారు. ఆ ఆధారాల నేపథ్యంలో సాధారణ నేరాలకే పరిమితం కాకుండా యూఏపీఏ నిబంధనలను కూడా కేసులో చేర్చారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
