ఆస్ట్రేలియాలో త్వరలో జరగనున్న ఫెసపల్లో వరల్డ్ కప్ పోటీలకు నగరానికి చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఫెసపల్లో అసోసియేషన్ అధ్యక్షుడు రేణుక దాస్ జెన్వాడ్కర్ ఎంపికైన క్రీడాకారుల వివరాలు వెల్లడించారు.
తెలంగాణలో శిక్షణ పొందిన విశాల్, ఉద్దేశ్, జూగూటి ఆర్ఎన్ అక్షయ్, వైష్ణవ్, అరుణ్ సాయి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 2 నుంచి 5 వరకు జరిగే ఈ పోటీలలో పది దేశాలు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ క్రీడను ప్రోత్సహించేందుకు చాలా మంది వ్యాపార వేత్తలు ముందుకు వస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ శాఖ అధికారులు సహకరించి, ఆర్థికంగా తోడ్పాటు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ జైదీప్ లఖానే, అసోసియేషన్ ప్రతినిధులు మయూర ఆకుల, విశాల్, మనీషా భారతీయ లు పాల్గొన్నారు.
