కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు బీసీలను ఏక తాటిపైకి నడిపించడానికి, దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వచ్చేనెల ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభకు ప్రత్యేక అతిధులుగా హాజరు కావాలని కోరుతూ ఈరోజు హైదరాబాదులో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ లను వారి నివాసంలో కలిసి ఆహ్వానించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రతి సంవత్సరం దేశంలో చారిత్రాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయడం ద్వారా బీసీ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు బలోపేతం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాతీయ ఓబీసీ మహాసభకు ప్రత్యేక అతిధులుగా పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ లు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు.
ఆగస్టు 7 నా బెంగళూరులోని సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలనుండి ప్రారంభమయ్యే జాతీయ ఓబిసి మహాసభలకు తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, బీసీ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావులకోల్ నరేష్ ప్రజాపతి, నాయకులు వరుణ్ కుమార్ గౌడ్, ఇంద్రమ్ రజక, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
