ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకొంటున్న అమరావతి రాజధాని నగరం పూర్తయితే లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం ఆయన మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులతో కలసి అమరావతిలో రూపు దాల్చిన ఐకానిక్ భవనాలను, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను, అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల క్వార్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారాయణ, శ్రీనివాస రావులతో కలిపి మీడియాతో మాట్లాడారు.
అమరావతిపై గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఇతర నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని మంత్రి రామానాయుడు ఖండించారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతి రాజధానిని స్వాగతిస్తున్నానని, 30,000 ఎకరాలు సరిపోవని, తాను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నానని, అమరావతి రాజధాని కదిలే ప్రసక్తి లేదని జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన విషయాలను రామానాయుడు గుర్తు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, మాట మార్చి, మడమ తిప్పి మూడు రాజధానులు అంటూ, మూడుముక్కలాట ఆడాడని విమర్శించారు. తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల లో మూడు ఇటుకలు కూడా పెట్టకుండా ఐదేళ్ళు కాలయాపన చేశాడన్నారు.
పదవిపోయి పదకొండు సీట్లు కే పరిమితమైనా, ఇప్పుడు మళ్లీ మాట మార్చి మావిగన్ అంటూ మతిస్థిరం లేని మాటలు మాట్లాడుతున్నాడని దుయ్య బట్టారు. ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడ రాజధాని అంటున్నారు. పెద్దిరెడ్డి 30 రాజధానులు అంటున్నారు. ఇలా ఆ గొడ్డలి పార్టీకి రాజధాని విషయంలో వాళ్లలో వాళ్లకే క్లారిటీ లేదని రామానాయుడు విమర్శించారు. పిచ్చి తుగ్లక్ సైతం, అసూయ, ఆశ్చర్య పోయేలా అమరావతి పై గొడ్డలి పార్టీ నాయకుడు మాట్లాడుతున్నాడన్నారు.
కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణాకు హైదరాబాద్ నుండి 70 శాతం ఆదాయం ఆందిస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఆదాయం ఇస్తుందన్నారు. అమరావతి రాజధాని వైఖరిలో జగన్ తీరు చూస్తే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. సచివాలయం అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, సుమారు 16,000 మంది ఒకేచోట పని చేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారన్నారు. ప్రపంచం లోనే అత్యంత పొడవైన సెక్రటేరియట్ భవనంగా 204 మీటర్లు ఎత్తుతో నిర్మిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే సచివాలయం, హెచ్ఓడి టవర్లు ఒకే చోట మెదటి సారిగా నిర్మిస్తున్నది మన రాష్ట్రంలోనే అని రామానాయుడు కొనియాడారు.
దేశంలోనే మొదటి డయా గ్రిడ్ బిల్డింగ్, లోపల ఎటువంటి పిల్లర్లు, లేకుండా, తుఫాన్ లు, వంటి ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా నిర్మిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు 12 టవర్లలో 276 ప్లాట్స్ 90 శాతం నిర్మాణం పూర్తయ్యాయని మున్సిపల్ మంత్రి నారాయణ నిమ్మలకు, పల్లాకు చూపించారు. అల్ ఇండియా సర్వీస్ అధికారులకు 6 టవర్ల తో 138 ప్లాట్స్ 95 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని నారాయణ సహచరులకు వివరించారు.
చంద్రబాబు నాయకత్వం లో ప్రపంచ స్థాయిలో ప్రజా రాజధాని నిర్మిస్తున్నామని మంత్రులిద్దరూ, పల్లా శ్రీనివాసరావు చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ కోసం మొత్తం 45.47 ఎకరాలకు గాను, 99. 5 శాతం మంది రైతులు నుండి భూమిని సమీకరించామన్నారు. ఇంకా కేవలం 1.52 ఎకరాలు మాత్రమే భూ సమీకరణ ద్వారా రావలసి ఉందని ఇది కేవలం 0.5% మాత్రమేనని రామానాయుడు చెప్పారు. కేవలం ఒకరో, ఇద్దరో రైతులు రాజకీయ దురుదేశ్యం తో భూములు ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని ఆయన అన్నారు.
