స్థానిక సంస్థల ఎన్నికలపై.. కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరిస్తోంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, జిల్లా.. మండల పరిషత్లు, పంచాయతీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కూటమికి బలమైన ప్రాంతాలతో ప్రారంభించి.. ప్రత్యర్ధిని మానసికంగా దెబ్బతీయడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు బలం ఎక్కువ. గత రెండేళ్ల నుంచి కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధితో అర్బన్ ఏరియాల్లో ప్రభుత్వంపై మరింత సానుకూలత కనిపిస్తోంది. అందుకే ముందుగా మున్సిపాలిటలు, కార్పొరేషన్ల ఎలక్షన్స్ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తర్వాత జడ్పీటీసీ, ఎంపీటీసీలు.. చివరగా పంచాయితీలకు ఎన్నికు జరుగుతాయని తెలుస్తోంది.
ఈ ప్లాన్ అమలు చేస్తే వైసీపీకి భారీ ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తే ప్రత్యర్ధులపై ఒత్తిడి పెరుగుతుంది. 2024లో వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చినా.. ఈ రెండేళ్లలో ఆ ఓటు బ్యాంకుకి పెద్ద గండి పడిందని సర్వేలు, విశ్లేషణలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోతే.. రూరల్ ఏరియాల్లో పోటీకి ఆ పార్టీ నేతలు వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది.
పట్టణాల్లో ఓటర్లు ఎన్నికలను సీరియస్గా తీసుకోరు. అధికారంలో ఉన్న పార్టీకే మొగ్గు ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అలా కాదు. పార్టీలతో సంబంధం లేకుండా పంచాయితీ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి స్థానిక వర్గ పోరాటాలు తెరపైకి వస్తాయి. అందుకే అర్బన్ పాకెట్స్లో తిరుగులేని గెలుపుతో.. రూరల్ ఏరియాల్లో వైసీపీని మానసికంగా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఓడిపోయే పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టుకోవడం వృధా అనే ఆలోచన మొదలైతే.. యుద్ధం ప్రారంభించకుండానే గెలవొచ్చు. కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న స్థానిక సంస్థల పద్మవ్యూహం నుంచి జగన్ తప్పించుకోవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.
