మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన సౌదీ ఆరామ్ కో కు చెందిన రాస్ తనూరా రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, జాగ్రత్త చర్యగా రాస్ తనూరా రిఫైనరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
గల్ఫ్ తీరంలో ఉన్న ఈ సముదాయం రోజుకు సుమారు 5.5 లక్షల బారెల్ల చమురు శుద్ధి సామర్థ్యం కలిగి ఉంది. ఇది సౌదీ ముడి చమురు ఎగుమతులకు కీలక టెర్మినల్గా కూడా పనిచేస్తుంది. సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అల్ అరేబియా టీవీకి ఇచ్చిన వివరాల ప్రకారం, రిఫైనరీపై వచ్చిన రెండు డ్రోన్లను అడ్డుకున్నారు. అయితే వాటి అవశేషాలు పడటంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది.
ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని వెల్లడించారు. ఇప్పటికే హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడంతో రవాణా దాదాపు నిలిచిపోయింది. ప్రపంచ చమురు వినియోగంలో సుమారు ఐదవ వంతు ఈ మార్గం ద్వారా సరఫరా అవుతుంది. ఈ నేపథ్యంలో రాస్ తనూరా రిఫైనరీ మూతపడటం చమురు సరఫరాపై ఆందోళనలను మరింత పెంచే అవకాశముంది. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధరలు సుమారు 10 శాతం పెరిగాయి.
రిస్క్ ఇంటెలిజెన్స్ సంస్థ విరాస్క్ మాప్లేకాఫ్ట్ కు చెందిన మిడిల్ ఈస్ట్ విశ్లేషకుడు టోర్బ్యోర్న్ సొల్ట్వెడ్ట్ మాట్లాడుతూ, “సౌదీ అరేబియాలోని రాస్ తనూరా రిఫైనరీపై దాడి ప్రాంతీయ స్థాయిలో పెద్ద చర్య. గల్ఫ్ దేశాల ఎనర్జీ మౌలిక సదుపాయాలు ఇప్పుడు ఇరాన్ లక్ష్యంగా మారాయి” అని అన్నారు.
ఈ దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ దేశాలు అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మరింత చేరువయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ పరిణామం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
