తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా సరిత తిరుపతి యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరయిన రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పశు పోషణ రంగంపై అవగాహన, అనుభవం ఉన్న సరిత తిరుపతి యాదవ్ను ఈ కీలక బాధ్యతకు నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గొర్రెలు, మేకల పెంపకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వృత్తి కులాలకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
సరిత తిరుపతి యాదవ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా పశుపోషకులకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అందేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. వృత్తి కులాల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
