గుండె పోటు ఏ వయసు వారికి వస్తుంది? సాధారణంగా 45 సంవత్సరాల వయసు దాటిన వారికి వస్తుందని అనుకుంటాం. కానీ ఒక 9 ఏళ్ల బాలిక గుండెపోటుతో మరణించిన హృదయవిదారక సంఘటన నేడు జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని నాగూర్ జిల్లా లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదేళ్ల బాలిక అనుమానిత గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన సోమవారం ఉదయం గోటన్ పట్టణంలో జరగగా ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, తల్నాపూర్కు చెందిన 5వ తరగతి విద్యార్థిని దివ్య బపేడియా ఉదయం ప్రార్థనల ముందు పాఠశాల మైదానంలో ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కుప్పకూలింది.
పాఠశాల సిబ్బంది ఆమెను వెంటనే గోటన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తరలించగా, వైద్యులు ఆమెను అప్పటికే మృతి చెందినట్లుగా ప్రకటించారు. వైద్యులు గుండెపోటు కారణంగా మృతి సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాల్లో, కుప్పకూలే క్షణాల ముందు దివ్య ఇతర పిల్లలతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది.
గోటన్ సీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ సుఖ్రామ్ తెలిపిన ప్రకారం, బాలికకు ఇంతకు ముందు ఎలాంటి ఆరోగ్య సమస్యల చరిత్ర లేదు. ఆమె శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదని, ప్రాథమిక విచారణలో గుండెపోటే మృతికి కారణమని తేలిందని చెప్పారు. కుటుంబ సభ్యులు మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించడానికి నిరాకరించడంతో, దేహాన్ని వారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
