ప్రపంచంహోమ్

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

#IsrailWar

గత కొద్ది నెలలుగా ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచంలోని చాలా దేశాలు ఇబ్బంది పడ్డ విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన నివేదికలో నిర్ఘాంతపోయే విషయాలు వెల్లడయ్యాయి.

అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన తాజా నివేదికలో, 2023 అక్టోబర్ 7 నుంచి భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు కనీసం 2,596 ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాల రవాణాలు జరిగినట్లు పేర్కొంది. గాజాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎగుమతులు “జాతి నిర్మూలన (Genocide)కు సహకరించే ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది” అని సంస్థ తన నివేదికలో వ్యాఖ్యానించింది.

అమ్నెస్టీ నివేదిక ప్రకారం, భారత్ ప్రభుత్వ యాజమాన్యంలో లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆయుధ సంస్థల ద్వారా ఈ ఎగుమతులు జరిగాయని పేర్కొంది. గాజాలో పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, భారత్ ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించిందని నివేదిక ఆరోపించింది.

ఈ నివేదిక కోసం భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన షిప్‌మెంట్ స్థాయి వాణిజ్య సమాచారాన్ని విశ్లేషించినట్లు అమ్నెస్టీ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం, భారతీయ కంపెనీలు ఇజ్రాయెల్ సైన్యానికి నేరుగా సరఫరా చేసే ప్రముఖ రక్షణ సంస్థలకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాలు, సైనిక వాహనాల భాగాలను పంపించాయని తెలిపింది.

గాజాపై ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసినా కూడా….

అమ్నెస్టీ సెక్రటరీ జనరల్ అగ్నెస్ కలమార్డ్ మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచం మొత్తం ప్రత్యక్షంగా గమనిస్తున్నప్పటికీ, భారతదేశం ఇజ్రాయెల్ సైనిక, రక్షణ రంగానికి మద్దతు కొనసాగిస్తున్నట్లు తమ పరిశోధన వెల్లడించిందని పేర్కొన్నారు.

2,596 షిప్‌మెంట్‌లలో కనీసం 3,90,516 చిన్న ఆయుధాల విడిభాగాలు, 5,64,970 పేలుడు ఆయుధాలకు సంబంధించిన భాగాలు (డ్రోన్ వార్‌హెడ్‌లు, ఆర్టిలరీ షెల్ కేసింగ్‌లు తదితరాలు), అలాగే 298 సైనిక వాహనాల భాగాలు ఇజ్రాయెల్‌కు పంపినట్లు రికార్డులు సూచిస్తున్నాయి.

అయితే పౌర అవసరాల కోసం ఉపయోగించే అవకాశమున్న సరఫరాలను, అలాగే క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన ఆయుధాలు, విడిభాగాలను ఈ లెక్కల్లో చేర్చలేదని అమ్నెస్టీ స్పష్టం చేసింది. అవి పౌరులను విచక్షణారహిత దాడుల నుంచి రక్షించడానికి ఉపయోగపడే అవకాశం ఉన్నందున వాటిని మినహాయించినట్లు తెలిపింది.

భారత్ నుంచి సరఫరా చేసిన వాటిలో మెషిన్ గన్ విడిభాగాలు, 155 మిల్లీమీటర్ల హై ఎక్స్‌ప్లోసివ్ ఆర్టిలరీ షెల్‌లు, స్కైస్ట్రైకర్ లోయిటరింగ్ మ్యూనిషన్‌కు సంబంధించిన పేలుడు వార్‌హెడ్‌లు ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

ఈ సరఫరాల్లో పాల్గొన్న భారతీయ సంస్థలుగా పీఎల్‌ఆర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండో ఎంఐఎం ప్రైవేట్ లిమిటెడ్, కళ్యాణి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్, ఆల్ఫా ఎల్సెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లను అమ్నెస్టీ ప్రస్తావించింది. అలాగే ఆయుధాలను స్వీకరించిన ఇజ్రాయెల్ సంస్థలుగా ఎల్బిట్ సిస్టమ్స్, రఫాయెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పేర్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం వెంటనే ఇజ్రాయెల్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రి, విడిభాగాల ఎగుమతులకు అనుమతులు నిలిపివేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. అలాగే భారత్ ఇప్పటికీ అంతర్జాతీయ ఆయుధ వాణిజ్య ఒప్పందం (Arms Trade Treaty-ATT)పై సంతకం చేయలేదని, అందులో సభ్యత్వం కూడా పొందలేదని నివేదిక గుర్తు చేసింది.

Related posts

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో మంత్రి లోకేష్ భేటీ ఎందుకు?

Satyam News

ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి

Satyam News

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

హోర్మోజ్ జలసంధి నుంచి భారత్ కు మరో రెండు నౌకలు

Satyam News

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

Satyam News

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

Leave a Comment