కృష్ణహోమ్

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

#CMChamber

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం…బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కల్తీ పాల ఘటన చాలా బాధాకరం

శాసన సభలో రాజమహేంద్రవరం ఘటనపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘రాజమహేంద్రవరం  ఘటనలోని బాధితులు వాంతులు, కడుపునొప్పి, డయాలసిస్ సమస్యతో ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు. క్లీనికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయి పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. కోరుకొండ మండలం, నరసాపురం గ్రామంలో వరలక్ష్మీ మిల్క్ డెయిరీ 106 కుటుంబాలకు రోజూ పాల సరఫరా చేస్తోంది.

ఈ డెయిరీ నుంచి వచ్చిన పాలను తాగి అనారోగ్యం పాలయ్యారని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు. మరో 8 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు 70 ఏళ్లకు పైబడిన వారు, ఒకరు 58 ఏళ్ల వయసు వారు ఉన్నారు. బాధితుల నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ల్యాబ్స్‌కు పరీక్షల కోసం పంపించాం. డెయిరీ నిర్వాహకుడు అద్దాల గణేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాసులకు కక్కుర్తి పడి ఈ కల్తీ వ్యవహారానికి పాల్పడితే సీరియస్‌గా తీసుకుంటాం. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసకుంటాం. రాష్ట్రంలో ఎవరైనా కల్తీకి పాల్పడినా, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు…అత్యంత కఠినంగా వ్యవహరిస్తాం’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

అసెంబ్లీలోని ఛాంబర్‌లో సమీక్ష

రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్‌, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో పాల వినియోగంతో స్థానికులు అస్వస్థతకు గురవడం, పలువురు మరణించారన్న ఘటన తెలియగానే ఉదయమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షించి ఘటనకు గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్యసాయంపై ఆరా తీశారు.

చికిత్స పొందుతున్న వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 75 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, మిగిలిన వారందరి నుంచి కూడా నమూనాలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై మరోసారి అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మంత్రులు, అధికారులతో మధ్యాహ్నం సీఎం చంద్రబాబు సమీక్షించారు.

Related posts

రేవంత్ రెడ్డీ…. టైమ్ పాస్ రాజకీయాలు వద్దు….

Satyam News

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై జీరో టాలరెన్స్ విధానం

Satyam News

సినీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న దళపతి విజయ్

Satyam News

బి.ఆర్.నాయుడుపై డీప్ ఫేక్ కుట్ర: మదనపల్లిలో కేసు నమోదు

Satyam News

రెండో టీ20లో భారత్ ఘనవిజయం

Satyam News

జగన్‌ పెళ్లి గోల… జనానికి బ్యాండ్‌.. బాజా..!!

Satyam News

Leave a Comment