పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విదేశీ జెండాలు కలిగిన నౌకల్లో పనిచేస్తున్న ముగ్గురు భారతీయ సముద్రయానికులు (సీఫేరర్లు) మృతి చెందారు. ఇదే ఘటనలో మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ సమీప సముద్ర ప్రాంతాల్లో భారతీయ సీఫేరర్లకు సంబంధించిన నాలుగు వేర్వేరు ఘటనలు చోటుచేసుకున్నట్లు డీజీ షిప్పింగ్ తెలిపింది.
క్షిపణి దాడులు, డ్రోన్ల కార్యకలాపాలు, ఎలక్ట్రానిక్ అంతరాయం వంటి భద్రతా ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో సముద్ర భద్రతా పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. తాజా సమాచారం ప్రకారం భారత జెండా కలిగిన నౌకలపై ఎలాంటి ప్రాణనష్టం, అదుపులోకి తీసుకోవడం లేదా బోర్డింగ్ ఘటనలు నమోదుకాలేదని స్పష్టం చేసింది.
అయితే పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ ధృవీకరణ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత జెండా నౌకలు ప్రస్తుతం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయ సీఫేరర్ల కోసం తక్షణ స్పందన, అవసరమైన సహాయం, తరలింపు చర్యల సమన్వయం కోసం ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాక్, సౌదీ అరేబియా, లెబనాన్ దేశాల్లో పలు దాడులు జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్లోని పలు నగరాల్లో వైమానిక దాడులు జరిపాయి. సైనిక కమాండ్ కేంద్రాలు, వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణి స్థావరాలు మరియు కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ సహా నలుగురు సీనియర్ సైనిక, భద్రతా అధికారుల మరణించినట్లు సమాచారం. టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. దీనికి ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా అమెరికా ఆస్తులు మరియు మిత్ర దేశాలపై ప్రతిదాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్ దేశాల్లోని లక్ష్యాలను గురి చేసింది. దీంతో మధ్యప్రాచ్యంలో ఘర్షణలు మరింత విస్తరించి, అక్కడి పౌరులు మరియు విదేశీ కార్మికుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
