హోర్మోజ్ జల సంధిని మూసి వేయాలని అమెరికా నిర్ణయం తీసుకోవడంపై సౌదీ అరేబియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హోర్ముజ్ జలసంధిని మూసివేయాలనే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని, తక్షణమే ఆంక్షలను ఎత్తివేసి చర్చల బాట పట్టాలని కోరుతోంది.
అరబ్ దేశాల అధికారుల సమాచారం ప్రకారం, ఈ అంశంపై ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు కీలక వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన వైఖరి ఇరాన్ను మరింత రెచ్చగొట్టే ప్రమాదం ఉందని సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. దీన్ని మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు తీసుకునే చర్యలు ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చని కూడా సౌదీ హెచ్చరించింది.
ముఖ్యంగా ఇరాన్కు చెందిన పోర్టులను దిగ్బంధనం చేస్తే, యెమెన్కు చెందిన హౌతి మిలిటెంట్ గ్రూప్ అన్సార్ అల్లాహ్ బాబ్ అల్-మందబ్ జలసంధిని మూసివేయవచ్చని ఆందోళన వ్యక్తమైంది. ఈ మార్గం కూడా అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకం.
హోర్ముజ్, బాబ్ అల్-మందబ్ రెండు జలసంధులు ప్రపంచ చమురు సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ రెండు మార్గాలు ఒకేసారి అంతరాయం కలిగితే, చమురు ధరలు భారీగా పెరగడం, సరఫరా గొలుసులు దెబ్బతినడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితుల్లో సౌదీ అరేబియా దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికాను కోరుతోంది. యుద్ధ పరిస్థితులు మరింత విస్తరించకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సూచిస్తోంది. పశ్చిమ ఆసియాలో ఇప్పటికే ఉద్రిక్తతలు అధికంగా ఉన్న నేపథ్యంలో, ఈ జలసంధులపై తీసుకునే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
