మత్స్యకారులను రెచ్చొగొట్టి తెలుగుదేశం పార్టీని విలన్ గా చూపెట్టాలని మాజీ సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దాంతో జగన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ విషయాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని, తద్వారా రాజకీయంగా జిల్లాలో పైచేయి సాధించాలనే వ్యూహంతోనే నెల్లూరు మత్స్యకార సభను జగన్ రెడ్డి ఏర్పాటు చేయించుకున్నారు.
టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కుటుంబ సభ్యులు తమిళనాడు జాలర్లకు సహాయం చేస్తున్నారనే ఆరోపణలను విస్త్రతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ లబ్ది పొందాలని ఆయన శతవిధాలా ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీపై ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేకత రెచ్చగొట్టినందున తాను పర్యటిస్తే జనాలు వేలం వెర్రిగా వస్తారని, ఇక మత్స్యకారులు తన కారు వెంట పరుగులు తీస్తారని ఎన్నో ఆశలతో నెల్లూరు కార్యక్రమం పెట్టుకున్న జగన్ కు నెల్లూరు మత్స్యకారులు షాక్ ఇచ్చారు.
జగన్ కార్యక్రమానికి వెళ్లడానికి వాళ్లు ఇష్టపడలేదు. జగన్ కార్యక్రమానికి వెళితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని కూడా కుల సంఘ నాయకులు ప్రకటించడం ఇక్కడ గమనార్హం. బీద మస్తాన్ రావు కుటుంబాన్ని మత్స్యకారులు బహిష్కరిస్తున్నట్లు, వారికి జరిమానా విధించినట్లు ప్రకటింపచేయడంలో కృతకృత్యులైన వైసీపీ నేతలకు ఇలా మత్స్యకారులు షాక్ ఇస్తారని ఊహించలేదు.
అక్రమంగా ఇక్కడ ఫిషింగ్ చేస్తోన్న తమిళనాడు బోట్లను తాము పట్టుకుంటే బీద మస్తాన్ రావు కుటుంబం వదిలేసిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇక్కడ మత్స్యకారులు బీద మస్తాన్ రావు కుటుంబంపై జరిమానా వేశారు. బీద మస్తాన్ రావు కుటుండంతో మాట్లాడితే మరింతగా జరిమానాలు విధిస్తామని, తమను బీద కుటుంబం మోసం చేస్తుందని ఆరోపించారు కూడా.
ఈ పరిస్థితులను ఉపయోగించుకోవడానికి జగన్ రెడ్డి ప్లాన్ వేయడంతో, అసలు మత్స్యకారులను రెచ్చగొట్టడానికి వైసీపీ వారే బోట్లను వదిలివేసి ఆ నెపాన్ని బీద మస్తాన్ రావు కుటుంబపైకి తోసి ఉంటారనే అనుమానాలు కూడా వచ్చాయి. జగన్ రెడ్డికి సంబంధించిన కొందరు వ్యక్తులు తమిళనాడు జాలర్ల పడవలు వదిలేసే కుట్రకు తెరలేపారనే చర్చలు ప్రారంభం కావడంతో మత్స్యకారులు సంశయంలో పడిపోయారు.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నెల్లూరు మత్స్యకారుల్లో నెలకొన్న అలజడిని తగ్గించేందుకు నెల్లూరు కలెక్టర్ హిమాన్ష్శుక్లా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అక్రమంగా వేటకు వస్తోన్న తమిళనాడు జాలర్లను నిరోధించేందుకు కలెక్టర్ కొత్తగా బోట్లను ఆగమేఘాలపై కొనుగోలు చేయించి, నిరంతరం తీరదళాలతో పర్యవేక్షణ చేయిస్తున్నారు. దీనిపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయించి వారికి భరోసా ఇచ్చారు. తాను వ్యక్తిగతంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని, తనపై భరోసా ఉంచాలని ఆయన ఆ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
ఆయన హామీని మత్స్యకారులు నమ్మారు. ఆయన పరిధిలో ఆయన న్యాయం చేస్తున్నారని, తమ సమస్యలను పరిష్కరిస్తున్నారనే భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఆయన నింపిన భరోసా వల్లే. ఇప్పుడు జగన్ రెడ్డి అక్కడ రాజకీయం చేద్దామన్నా అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద జగన్ నెల్లూరు పర్యటన ప్లాప్ కాగా పరోక్షంగా ఈసభ ప్లాప్కు కలెక్టర్ తక్షణమే తీసుకున్న చర్యలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
