ఓటమిని తట్టుకోలేని మమతా బెనర్జీ పార్టీ వారు ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. మమతా బెనర్జీ ప్రత్యర్థి సువేందు అధికారి కార్యనిర్వాహక సహాయకుడు చంద్రనాథ్ రాథ్ హత్య ఈ కోవకే చెందుతుందని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే తన కుమారుడు హత్యకు గురికావడం తట్టుకోలేకపోతున్నానని రాథ్ తల్లి కన్నీటి పర్యంతమయ్యారు.
బుధవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో మధ్యగ్రామ్లోని డోల్తాలా ప్రాంతం వద్ద బైక్పై వచ్చిన దుండగులు చంద్రనాథ్ రాథ్ వాహనాన్ని అడ్డగించి కాల్పులు జరిపినట్లు సమాచారం. వాహనం ఆపించిన అనంతరం అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్పందించిన రాథ్ తల్లి, ఇది సాధారణ హత్య కాదని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జరిగిన దాడి అని ఆరోపించారు. మమతా బెనర్జీ భవానీపూర్లో ఓడిపోవడంపై ప్రతీకారంగానే తన కుమారుడిని టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. నందిగ్రామ్, భవానీపూర్ ఎన్నికల బాధ్యతలను తన కుమారుడు నిర్వహించాడని, అందుకే అతడిని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు.
“అతడు ప్రమాదంలో చనిపోయి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. ఎన్నికల బాధ్యతలు నిర్వహించినందుకే అతడిని హత్య చేశారు” అంటూ ఆమె స్థానిక టీవీ చానళ్ల ముందు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
