హర్యానాలోని హిసార్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భాగస్వామి కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతురాలిని 32 ఏళ్ల పూజగా గుర్తించగా, నిందితుడు 28 ఏళ్ల గౌరవ్ను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, వివాహిత అయిన పూజ తన భర్తను విడిచి గౌరవ్తో సహజీవనం చేస్తోంది. అయితే గత కొంతకాలంగా పూజ మరో వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తోందనే అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే వివాదం బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఘర్షణకు దారితీయగా, గౌరవ్ కత్తితో పూజపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ, పొట్ట, వీపు భాగాల్లో పలుమార్లు కత్తిపోట్లకు గురైన పూజ అక్కడికక్కడే మృతి చెందింది.
హత్య అనంతరం గౌరవ్ నేరుగా సూర్యనగర్ పోలీసు ఔట్పోస్ట్కు వెళ్లి తానే పూజను హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు అతడితో కలిసి శివ్ నగర్లోని అద్దె ఇంటికి వెళ్లగా, గదిలో పూజ మృతదేహం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గౌరవ్ ఈ-రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని, రెండు నెలల క్రితమే శివ్ నగర్లోని అద్దె ఇంటికి మారినట్లు పోలీసులు తెలిపారు. గత ఐదు నెలలుగా పూజ మరో వ్యక్తితో మాట్లాడుతుండటంతో తమ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గౌరవ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.
పోలీసుల కథనం ప్రకారం, పూజకు గతంలో రెండు వివాహాలు జరిగాయి. తొలి భర్త మరణించడంతో అనంతరం తన బావను రెండో వివాహం చేసుకుంది. మొదటి వివాహంలో ఇద్దరు కుమారులు, రెండో వివాహంలో ఒక కుమార్తె ఉన్నారు. రెండో వివాహం కూడా విఫలమైన తర్వాత గౌరవ్తో కలిసి నివసించడం ప్రారంభించింది.
మృతురాలి తల్లి సంగీత మాత్రం గౌరవ్ తన కుమార్తెను అక్రమ కార్యకలాపాల వైపు నెట్టాడని, ఆమె జీవితంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు కూడా సంపాదించాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై కూడా దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.
ఈ కేసులో గౌరవ్ను అరెస్టు చేసిన పోలీసులు, హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
