పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో హోర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. ఇరాన్ అత్యున్నత నేత అలీ ఖమేనీ హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, శత్రువులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఇరాన్ సైన్యం చరిత్రలో తొలిసారిగా కువైట్, బహ్రెయిన్ తో పాటు జోర్డాన్ దేశాలపై ఒకేసారి భారీ దాడులకు తెగబడటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి.
ఇరాన్ చర్యలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యంత తీవ్రంగా స్పందించారు. ఇరాన్ గనుక తన దూకుడును తగ్గించుకోకపోతే ఆ దేశంపై ఏకంగా వెయ్యి క్షిపణులతో భారీ దాడి చేస్తామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ చేశారు. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, మరోవైపు అమెరికా క్షిపణి దాడుల హెచ్చరికలు చేయడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
