జాతీయ గీతాన్ని అవమానిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నది. అందుకోసం రాబోయే పార్లమెంటు సమావేశాలలో ‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (సవరణ) బిల్లు–2026’ ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకున్నది.
ఈ సవరణ బిల్లు అమల్లోకి వస్తే జాతీయ గీతం, ‘వందే మాతరం’ ను అవమానించడం లేదా అగౌరవపరచడం కూడా శిక్షార్హ నేరంగా పరిగణించే నిబంధనలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశ గౌరవానికి సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 ప్రకారం జాతీయ జెండా, భారత రాజ్యాంగం, జాతీయ గీతం ‘జన గణ మన’ను అవమానించడం లేదా ఉద్దేశపూర్వకంగా అగౌరవపరచడం శిక్షార్హ నేరంగా ఉంది. అయితే జాతీయ గేయమైన ‘వందే మాతరం’ కు ఇదే తరహా ప్రత్యేక క్రిమినల్ రక్షణ ప్రస్తుతం చట్టంలో లేదు.
ప్రతిపాదిత సవరణ బిల్లు ద్వారా జాతీయ గేయాన్ని కూడా జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లు ఆమోదం పొందితే ‘వందే మాతరం’ను ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అవహేళన చేయడం లేదా అగౌరవపరచడం కూడా శిక్షార్హ నేరంగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన శిక్షలు, జరిమానాలు, అమలు విధానంపై బిల్లులో స్పష్టమైన నిబంధనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ‘వందే మాతరం’ కు ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యం ఉంది. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఆనందమఠ్ నవలలో ఈ గేయం తొలిసారిగా వెలువడింది. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు ఇది స్ఫూర్తినిచ్చే జాతీయ గేయంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ‘జన గణ మన’ను జాతీయ గీతంగా, ‘వందే మాతరం’ ను జాతీయ గేయంగా గుర్తించింది.
ఈ సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇరు సభల్లో చర్చ జరగనుంది. బిల్లు ఆమోదం పొందితే జాతీయ గేయానికి కూడా జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే బిల్లు అధికారికంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాతే తుది నిబంధనలు, శిక్షల వివరాలు స్పష్టమవుతాయి.
