రాజకీయ పార్టీగా మారే అవకాశాలపై చర్చిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆ ఆలోచన తాత్కాలికంగా విరమించుకున్నట్లు కనిపిస్తున్నది.
దేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీ కంటే ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చే శక్తివంతమైన ఒత్తిడి వేదిక (ప్రెజర్ గ్రూప్) అవసరమని, అందుకే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రస్తుతం అదే దిశగా పనిచేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో బుధవారం జరగనున్న సీజేపీ కోర్ కమిటీ సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజల్లో మీడియా, న్యాయవ్యవస్థ వంటి కీలక ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసం క్రమంగా తగ్గిపోతున్న అంశంపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు దిప్కే వెల్లడించారు. అలాగే ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వంటి ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయని చెప్పారు.
“ప్రస్తుతం దేశానికి అవసరమైనది ఒక బలమైన ప్రెజర్ గ్రూప్. అందుకే సీజేపీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది” అని అభిజీత్ దిప్కే పేర్కొన్నారు.
సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుతూ, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పార్టీకి మార్గదర్శకుడిగానే కొనసాగుతారని, కీలక అంశాలపై ఆయన సలహాలను తీసుకుంటామని తెలిపారు.
ఇటీవల సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ ప్రశ్నపత్రం లీక్, ఇతర పోటీ పరీక్షల అవకతవకలకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించాలనే డిమాండ్ను ప్రభుత్వం ముందు బలంగా ఉంచుతామని సౌరవ్ దాస్ చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి ఆందోళనల్లో గాయపడిన నిరసనకారులకు న్యాయపరమైన, వైద్య సహాయం అందించేందుకు కూడా పార్టీ చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు.
అమెరికా నుంచి జూన్లో భారత్కు తిరిగి వచ్చిన అభిజీత్ దిప్కే, నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ ఉద్యమానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యంగా జెన్-జెడ్ యువత పెద్దఎత్తున మద్దతు తెలిపింది. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని, అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ పేర్కొంది.
సీజేపీ ఆధ్వర్యంలోని ఈ ఉద్యమం ఢిల్లీతో పాటు ముంబై, కోల్కతా, బిహార్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. అయితే పలు చోట్ల ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులపై చర్యలు చేపట్టి, అనేక మంది విద్యార్థులపై కేసులు నమోదు చేశారు.
