విశాఖపట్నం నగరంలో డ్రగ్స్ కలకలం రేపింది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద పోలీసులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ (MDMA)ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. సుదర్శన్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, అతని వద్ద నుంచి 8 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. సుదర్శన్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరో నిందితుడు సోరాజ్ కుమార్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు గోపాలపట్నం సీఐ వెల్లడించారు.
డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్న ఆరిలోవకు చెందిన కృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న ఎండీఎంఏను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఈ డ్రగ్స్ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు గోపాలపట్నం పోలీసులు తెలిపారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
