మీరట్ లోని లిసాడీ గేట్ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో కిడ్వాయ్ నగర్లో ఈ ఘటన జరిగింది. కాలిన గాయాలతో ఏడుగురిని సివిల్ ఆసుపత్రికి తరలించగా, వారిలో ఆరుగురిని వైద్యులు మృతి చెందినట్లుగా ప్రకటించినట్లు మీరట్ ఎస్పీ అవినాష్ పాండే మీడియాకు తెలిపారు. రాత్రి 8:49 గంటలకు ఇక్బాల్ అహ్మద్ నివాసంలో అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఆ ఇంట్లో టైలరింగ్ పని జరుగుతుండడంతో పెద్ద మొత్తంలో బట్టలు నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. అవే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమయ్యాయని చెప్పారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నామని, అయితే పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
మృతులను రుక్సార్ (25), మహ్బిష్ (12), హమ్మాద్ (4), అక్దాస్ (4), నాబియా (4 నెలలు), ఇనాయత్ (4 నెలలు)గా గుర్తించారు. వీరంతా కిడ్వాయ్ నగర్లోని సురాహి వాలి మస్జిద్ సమీపంలోని గల్లీ నం. 3 నివాసితులని తెలిపారు. గాయపడిన అమీర బానో (55) ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
