కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలోని దక్షిణ అమెజాన్ ప్రాంతంలో 110 మందికి పైగా సైనికులతో వెళ్తున్న ఒక సైనిక విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. కొలంబియా రక్షణ మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో లాక్హీడ్ మార్టిన్ హెర్క్యులస్ సి-130 (Lockheed Martin Hercules C-130) రకానికి చెందిన విమానం కుప్పకూలింది. భూమిని ఢీకొన్న వెంటనే విమానంలో భారీగా మంటలు చెలరేగడంతో అది పూర్తిగా దగ్ధమైంది.
పుటుమాయో ప్రావిన్స్లోని ప్యూర్టో లెగుయిజామో విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 34 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 125 మంది (సిబ్బందితో కలిపి) ఉన్నారని, అందులో 110 మంది సైనికులేనని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
విమానంలో మందుగుండు సామాగ్రి ఉండటంతో, ప్రమాదం తర్వాత జరిగిన పేలుళ్లు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగించాయి. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సైనిక విమానాల ఆధునీకరణలో ఎదురవుతున్న అడ్డంకుల వల్ల యువ సైనికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తుకు ఆదేశించినట్లు రక్షణ మంత్రి పెడ్రో శాంచెజ్ తెలిపారు.
