దేశంలో అక్రమ వలసలు మరియు ఇతర “అసహజ కారణాల” వల్ల చోటుచేసుకుంటున్న జనాభా మార్పులను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నయోల్కర్ అధ్యక్షత వహించనున్నారు.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో హిందీలో చేసిన పోస్టులో అమిత్ షా ఈ మేరకు ప్రకటించారు. అక్రమ చొరబాట్లు మరియు ఇతర కారణాల వల్ల దేశ జనాభా నిర్మాణంలో అసహజ మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఇది ఏ దేశానికైనా ప్రస్తుత కాలంలోనే కాక భవిష్యత్తులో కూడా పెద్ద సవాలుగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత సంవత్సరం ఆగస్టు 15న “జనాభా మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ” ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారని అమిత్ షా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కమిటీలో సభ్యులుగా జనగణన కమిషనర్తో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థిక నిపుణురాలు డాక్టర్ శామికా రవి ఉండనున్నట్లు వెల్లడించారు. అలాగే కేంద్ర హోంశాఖలో విదేశీయుల విభాగం జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జనాభా మార్పుల ధోరణి, అక్రమ వలసల ప్రభావం, భద్రతా మరియు సామాజిక అంశాలపై ఈ కమిటీ సమగ్ర నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
