2047 కాదు…2037 కే స్వర్ణాంద్ర దిశగాఏపీ అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు శనివారం ఉద్ఘాటించారు. కాగా స్వర్ణాంధ్ర సాధన లో భాగంగా జిల్లాలో 15 శాతం వృద్ధి రేటును సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచడానికి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
జిల్లాలో చీపురుపల్లి మండలం రావివలస లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం, పించన్ల పంపిణీ కార్యక్రమం లో సీఎం చంద్ర బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ప్రారంభ ఉపన్యాసం చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 2025-26 సంవత్సరానికి 3280 ఎకరాలలో ఉద్యాన సాగు అదనంగా తీసుకురావడం జరిగిందని, ఈ రబీ సీజన్లో మరో 4 వేల ఎకరాలను సాగులోనికి తీసుకు రావడం జరిగిందని అన్నారు.
రాబోయే ఖరీఫ్ కు మరో 6 వేల ఎకరాలను సాగు లోనికి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి లో భాగంగా ఫుడ్ పార్క్స్, టాయ్ ఇండస్ట్రీ, హెల్త్ హబ్, ఐ.టి పార్క్స్ కోసం భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు. నియోజక వర్గం కు ఒక ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు లో భాగంగా జిల్లాలో 5 నియోజక వర్గాలలో భూమిని కేటాయించడం జరిగిందన్నారు.
జిల్లాలో 2 లక్షల 72 వేల మందికి 115.63 కోట్లు ప్రతి నెల పించన్ పంపిణీ జరుగుతోందని, 98 శాతం వరకు ఒకటవ తారీఖునే వారి గడప వద్దనే పించన్ అందుకుంటున్నారని తెలిపారు. రావివలస గ్రామం లో 386 మందికి 16.03 లక్షల రూపాయలను అందించడం జరిగిందని తెలిపారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యెక దృష్టి పెట్టి విశాఖ ఎకనామిక్ రీజియన్ , భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ , సాగునీరు , తాగు నేరు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తున్న ముఖ్యమంత్రి కి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలను తెలిపారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత , ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ సి.ఈ.ఓ వాకాటి కరుణ , వైద్య శాఖ కమీషనర్ వీరపాండ్యన్ , పించన్ దారులు కొక్కేర్ల కాంతమ్మ , మన్నేల రాము తదితరులు పాల్గొన్నారు.
