ముంబైలో భారీ విషాదం తృటిలో తప్పింది. ముంబైలో జరిగిన మొహర్రం ఊరేగింపులో జరగడానికి సిద్ధంగా ఉన్న భారీ విషాదాన్ని పోలీసులు తృటిలో అడ్డుకున్నారు. ఊరేగింపులో పాల్గొన్న వారికి నొప్పి నివారణ మాత్రల పేరుతో విషపూరిత గుళికలను పంపిణీ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో విషపూరిత గుళికలను స్వాధీనం చేసుకున్నారు.
ముంబై మధ్య ప్రాంతం-1 ఉప పోలీసు కమిషనర్ జయంత్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం, బైకుల్లా పోలీసు స్టేషన్ పరిధిలో మొహర్రం ఊరేగింపు జరుగుతున్న సమయంలో అనుమానాస్పదంగా గుళికలు పంచుతున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడి వద్ద ఉన్న గుళికలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటివరకు మొత్తం 14,900 గుళికలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఉదయం సుమారు నాలుగు గంటల సమయంలో సల్మాన్ అనే వ్యక్తి ఆ గుళికల్లో ఒకటి తీసుకున్న తర్వాత వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు వెంటనే దర్యాప్తు వేగవంతం చేసి అనుమానితుడిని అరెస్టు చేశారు.
విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడని వెల్లడించారు. సుమారు 50 కిలోల ఎలుకల విషపదార్థాన్ని కొనుగోలు చేసి, 30 వేల ఖాళీ గుళికలను తెప్పించుకుని గత 15 రోజులుగా వాటిలో విషాన్ని నింపినట్లు విచారణలో బయటపడింది. అనంతరం వాటిని నొప్పి నివారణ గుళికలుగా చెప్పి ప్రజలకు పంపిణీ చేయాలని యోచించినట్లు తెలిపాడు.
నిందితుడు రంగుల వ్యాపారం నిర్వహిస్తున్నాడని, అదే వ్యాపారం ద్వారా రసాయనాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఖాళీ గుళికలను అంతర్జాలం ద్వారా కొనుగోలు చేసినట్లు కూడా వెల్లడైంది. అతడి విదేశీ ప్రయాణాల వివరాలు, ముంబైలో అతడికి సహకరించిన ఇతర వ్యక్తులు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదాన్ని పోలీసులు సమయానికి గుర్తించి అడ్డుకోవడంతో పెద్ద విషాదం తప్పిందని అధికారులు తెలిపారు.
