ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన కీలక నేతలు, అధికారులే లక్ష్యంగా హైదరాబాద్, తిరుపతిలోని 12 చోట్ల ED అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఆస్తుల రికార్డులు బయటపడటం వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఈ దాడుల్లో ప్రధానంగా వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ వ్యక్తిగత సహాయకులుగా పనిచేసిన ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మరియు సజ్జల శ్రీధర్ రెడ్డి నివాసాల్లో సోదాలు జరిగాయి. మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడి నిధులను మళ్లించారనే అభియోగాలపై ఈ విచారణ కొనసాగుతోంది.
ఈ మొత్తం స్కామ్కు IT సలహాదారుగా పనిచేసిన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాస్టర్ మైండ్ అని ED భావిస్తోంది. APSBCLను అడ్డం పెట్టుకుని, మ్యాన్యువల్ సిస్టమ్ ద్వారా తనకు నచ్చిన కంపెనీలకే ఆర్డర్లు ఇప్పించి భారీగా కమీషన్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుమారు ₹3,200 కోట్ల అక్రమ సొమ్మును వివిధ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేశారని ED ప్రాథమికంగా గుర్తించింది.
నిధుల మళ్లింపు ఇలా..!
మద్యం ద్వారా వచ్చిన అక్రమ డబ్బును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లోకి మళ్లించినట్లు అధికారులు చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మద్యం కంపెనీలకు ఆర్డర్లు రావడంలో కీలక పాత్ర పోషించారని ఈడీ పేర్కొంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నగదు రవాణా, నిధుల సర్దుబాటులో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ అక్రమ నిధులను వైల్డర్నెస్ రాంచ్ వంటి విలాసవంతమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు ED ఆధారాలు సేకరించింది. మొత్తానికి, జగన్ హయాంలో జరిగిన మద్యం పాలసీ వెనుక ఉన్న పెద్ద తలకాయల చుట్టూ ఇప్పుడు ED ఉచ్చు బిగుస్తోంది.
