ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దేశ సమగ్రతకు భంగం కలిగించేలా పోస్టులు, రీల్స్ ప్రచారం చేశారనే ఆరోపణలపై పలువురు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల నిర్వాహకులతో పాటు మెటా ఇండియా అధిపతిపై కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీజేపీ (Cockroach Janta Party-CJP) ఆధ్వర్యంలో జరిగిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆందోళనల నేపథ్యంలో ఈ పోస్టులు వైరల్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, జూలై 29న సాయంత్రం 7.40 గంటలకు బీజేపీ తెలంగాణ సోషల్ మీడియా కోర్ కమిటీ సభ్యుడు, హైదరాబాద్ నాంపల్లిలోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భవన్ నివాసి టి. సాయికిరణ్ గౌడ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాను పరిశీలిస్తుండగా, ప్రధాని నరేంద్ర మోదీని అవమానించేలా, మార్ఫింగ్ చేసిన వీడియోలు, రీల్స్, పోస్టులు కనిపించాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుదారు మొత్తం 20 ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, రీల్స్కు సంబంధించిన యూఆర్ఎల్లను పోలీసులకు అందజేశారు. ఈ కంటెంట్ దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా ఉందని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉందని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని, జాతీయ భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశముందని ఆరోపించారు.
ఈ పోస్టులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను వెంటనే భద్రపరచాలని, సంబంధిత సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను గుర్తించాలని, మెటా ప్లాట్ఫార్మ్స్ నుంచి ఖాతాల వివరాలను సేకరించాలని, అలాగే ఇలాంటి మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర కంటెంట్ను అనుమతించినందుకు మెటాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ కె. హరిరామ్ కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(C), 67తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 353(2), 336(4) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తును ఇన్స్పెక్టర్ పి. జయశంకర్కు అప్పగించారు. సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకుల వివరాలు, పోస్టుల మూలం, వాటి వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
