చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణపై ఇరాన్, ఒమన్ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకల కోసం కొత్త మార్గంపై ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయని, సంయుక్తంగా ఈ జలసంధి నిర్వహణకు సంబంధించిన ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఒప్పందం అమల్లోకి రావడం అమెరికా వైఖరిపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఇరు దేశాలు ప్రతిపాదిత సముద్ర మార్గానికి సంబంధించిన భౌగోళిక సమన్వయాలను ఖరారు చేశాయని తెలిపారు. మూడో పక్షం జోక్యం లేకుంటే ప్రధాన అంశాలపై సంయుక్త ప్రకటనను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన హోర్ముజ్ జలసంధి పూర్తిగా సురక్షితంగా మారిందని భావించరాదని పేర్కొన్నారు.
అమెరికా తన నౌకాదళం ద్వారా ఇరాన్ పోర్టులపై కొనసాగిస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధ చర్యలు, సైనిక బెదిరింపులు కొనసాగుతున్నంత వరకు హోర్ముజ్ జలసంధిలో అసురక్షిత పరిస్థితులు తొలగవని బఘాయీ వ్యాఖ్యానించారు. అమెరికా ఈ చర్యలను ఉపసంహరించుకున్న తర్వాతే జలసంధిని పూర్తిగా తెరవడంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది.
ఇటీవలి కాలంలో హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ తన తీరానికి ఆనుకుని నౌకలు ప్రయాణించాలనే నిబంధనను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే అనేక వాణిజ్య నౌకలు ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ మార్గాన్ని ఎంచుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం ప్రకారం గల్ఫ్లోకి ప్రవేశించే, బయటకు వచ్చే వాణిజ్య నౌకలు ప్రధానంగా ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా ప్రయాణించేలా మార్గాన్ని రూపొందించినట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది తెలిపారు. ఈ అంశంపై ఒమన్తో ప్రాథమిక అవగాహన పూర్తైందని, తుది ఒప్పందం ఖరారుకు చేరువలో ఉందన్నారు.
అయితే ఈ ప్రతిపాదిత వ్యవస్థపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై ఇరాన్కు అధిక నియంత్రణ లభించే విధంగా ఒప్పందం ఉండడాన్ని అమెరికా గతంలోనే వ్యతిరేకించింది. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హోర్ముజ్ జలసంధి త్వరలోనే తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదే సమయంలో రాయిటర్స్ కథనం ప్రకారం, గల్ఫ్ దేశాల ప్రతినిధులు నౌకల తనిఖీలు ప్రాంతీయ దేశాల పర్యవేక్షణలో జరగాలని, వసూలు చేసే రుసుములు స్వచ్ఛందంగా ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. అలాగే గల్ఫ్లోకి ప్రవేశించే నౌకలపై ఇరాన్కు ఎంత మేర నియంత్రణ ఉండాలి, బయటకు వెళ్లే నౌకల విషయంలో దాని పాత్ర ఎలా ఉండాలనే అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
మరోవైపు, అమెరికా మరోసారి ఇరాన్పై దాడి చేస్తే గల్ఫ్ ప్రాంతంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార చర్యలు చేపడతామని ఇరాన్ పలు గల్ఫ్ దేశాలకు హెచ్చరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఇరాన్ ఇంధన వ్యవస్థపై దాడి చేసే అవకాశాన్ని ప్రస్తావించిన నేపథ్యంలో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్ విదేశాంగ మంత్రులతో పాటు పాకిస్థాన్ ఉన్నతాధికారులతో కూడా అత్యవసరంగా చర్చలు జరిపినట్లు సమాచారం.
