ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది. రోజ్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక పీసీ యాక్ట్ న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ కేసును మూసివేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదా అవినీతి ఉద్దేశం లేదని కోర్టు స్పష్టం చేసింది. “ఈ ఎక్సైజ్ విధానంలో సమగ్ర కుట్ర లేదా నేరపూరిత ఉద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు” అని న్యాయమూర్తి పేర్కొన్నారు. 2022లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. మద్యం తయారీదారుల నుంచి కిక్బ్యాక్లు తీసుకుని పాలసీని మార్పులు చేశారని ఆరోపణలు వచ్చాయి.
అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021 నవంబర్ 17న కొత్త ఎక్సైజ్ విధానాన్ని అమలు చేసింది. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2022 సెప్టెంబర్ చివర్లో ఆ విధానాన్ని రద్దు చేసింది.
ఈ విధానంలో హోల్సేలర్ల లాభ మార్జిన్ను 5 శాతం నుంచి 12 శాతానికి పెంచినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. దీనివల్ల కార్టెల్ వ్యవస్థ ఏర్పడి, అర్హత లేని వారికి లైసెన్సులు ఇచ్చారని ఆరోపించారు. అయితే మనీష్ సిసోడియా ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఈ విధానం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగేదని తెలిపారు.
కోర్టు వ్యాఖ్యలు
ప్రాసిక్యూషన్ వాదనలు న్యాయపరీక్షను తట్టుకోలేకపోయాయని కోర్టు అభిప్రాయపడింది.
సీబీఐ ఊహాగానాల ఆధారంగా కుట్ర కథనాన్ని నిర్మించేందుకు ప్రయత్నించిందని వ్యాఖ్యానించింది.
అప్రూవర్ స్టేట్మెంట్లపై అధికంగా ఆధారపడటాన్ని కోర్టు తీవ్రంగా విమర్శించింది.
నిందితుడికి క్షమాభిక్ష ఇచ్చి, ఆ వ్యక్తి వాంగ్మూలాన్ని ఇతరులను ఇరికించేందుకు ఉపయోగించడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
నిర్దోషులుగా విడుదలైన 23 మంది:
- కుల్దీప్ సింగ్
- నరేందర్ సింగ్
- విజయ్ నాయర్
- అభిషేక్ బోయినపల్లి
- అరుణ్ రామచంద్ర పిళ్లై
- మోఠా గౌతమ్
- సమీర్ మహేంద్రు
- మనీష్ సిసోడియా
- అమన్దీప్ సింగ్ ఢాల్
- అర్జున్ పాండే
- బుచ్చిబాబు గొరంట్ల
- రాజేష్ జోషి
- దామోదర్ ప్రసాద్ శర్మ
- ప్రిన్స్ కుమార్
- అరవింద్ కుమార్ సింగ్
- చాన్ప్రీత్ సింగ్ రాయత్
- కే. కవిత
- అరవింద్ కేజ్రీవాల్
- దుర్గేష్ పాఠక్
- అమిత్ అరోరా
- వినోద్ చౌహాన్
- ఆశిష్ చంద్ మాథూర్
- శరత్ చంద్ర రెడ్డి
ఈ తీర్పుతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు ముగిసినట్లు అయింది.
