పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక టీచర్ ‘హనీ ట్రాప్’ కు పాల్పడి ఎంతో మందిని బ్లాక్ మెయిల్ చేసిన సంఘటన బెంగళూరులో జరిగింది. బెంగళూరులోని ఓ ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న శ్రీదేవి రుడాగిపై చిన్నారుల తండ్రులను లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్కు పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, గుజరాత్కు చెందిన ఓ వ్యాపారి ఈ వ్యవహారంలో బాధితుడిగా ఉన్నారు. తన చిన్నారి చదువుతున్న పాఠశాల ద్వారా పరిచయం ఏర్పడిన అనంతరం, ఉపాధ్యాయురాలు తనతో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకుని, తర్వాత వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించిందని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది.
మొదట బాధితుడి నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకున్నట్లు, ఆ తర్వాత మరింత డబ్బు ఇవ్వాలని నిరంతరం వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. డబ్బు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను కుటుంబ సభ్యులకు, పరిచయస్తులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు.
నిరంతర వేధింపులు, బ్లాక్మెయిల్ను భరించలేక చివరకు బాధితుడు బెంగళూరు పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
ఈ వ్యవహారంలో మరికొందరు బాధితులు ఉన్నారా, ఇది పథకం ప్రకారమే నిర్వహించబడిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆరోపణలు ఇంకా న్యాయపరంగా రుజువు కాలేదని, దర్యాప్తు పూర్తయ్యాకే పూర్తి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
