నీట్ ప్రశ్నాపత్రం పేరుతో ప్రధాని నరేంద్రమోడీపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కాక్రోచ్ లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా రుచికా సింగ్ అనే యువతిపై కేసు నమోదు అయింది. 25 ఏళ్ల రుచికా సింగ్ ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
జూలై 23న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో రుచికా సింగ్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఆమె ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ గురించీ అవమానకరంగా వ్యాఖ్యానించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 29న ఉత్తరప్రదేశ్లోని నోయిడా-ఎక్స్ప్రెస్వే పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిర్యాదులో, జూలై 23న జంతర్ మంతర్లో జరిగిన కార్యక్రమంలో రుచికా సింగ్ భారత ప్రధానమంత్రిపై బహిరంగంగా అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించిందని పేర్కొన్నారు. ఈ చర్య రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు, ప్రజా శాంతిని భంగం కలిగించేందుకు చేసిన ప్రయత్నంగా భావిస్తున్నట్లు ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఘటన ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిధిలో జరిగినందున, జీరో ఎఫ్ఐఆర్ను తదుపరి దర్యాప్తు కోసం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీ పోలీసులు పలు సోషల్ మీడియా ఖాతాలపై కూడా చర్యలు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO) విభాగం ఎక్స్ (X) సంస్థకు నోటీసులు జారీ చేసి, సంబంధిత పోస్టులను తొలగించడంతో పాటు వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, నిరసనల సమయంలో మరియు అనంతరం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అభ్యంతరకర కంటెంట్ను తొలగించే సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు. రాజత్ రంజన్, విజిలెంట్ హిందుత్వ, జైపూర్ డైలాగ్స్, సాఫ్రాన్ ఛార్జర్స్, అల్పకన్య, దీపికా భారద్వాజ్, బేసురా తాన్సానే, ప్రీతమ్క్రబౌద్ధ్, ప్రాక్టికల్ స్పై తదితర ఎక్స్ ఖాతాలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
