ప్రజలు జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు… మేమేం చేస్తాం అని ఆర్థిక,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అధికార పార్టీగా మేము హుందాగానే వ్యవహరించి మంత్రులతో పాటు ప్రమాణం చేయించాం అని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచన ల మేరకే రాశారా…? అని ఆయన ప్రశ్నించారు. సలహాదారుల సలహాలు తీసుకుంటే మునిగి పోతారనీ జగన్ గుర్తించాలి అని వ్యాఖ్యానించారు.
జగన్ కేవలం మద్యం , ఇసుక ఖాతాల పుస్తకాలే కాదు శాసన సభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే పుస్తకాలు చదవాలి. వైసీపీ కి ప్రతిపక్ష హోదా లేదు…అందుకే జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు. జగన్ కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమే. రూల్ బుక్ లో ఓనమాలు కూడా చదవకుండా స్పీకర్ కు లేఖ ఎలా రాశారు? అని మంత్రి కేశవ్ ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా అన్ని శాసన సభ లు, పార్లమెంటు పాటించే నిబంధనలు జగన్ తెలుసుకోవాలని కోరుతున్నాం. ప్రతిపక్ష హోదా ఎవరికీ ఇవ్వాలన్న దానిపై తొలి స్పీకర్ మల్వంకర్ నిర్దేశించారు. 10 శాతం కూడా సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుంది? అని మంత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు ప్రకారం జగన్ కూ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే అవకాశం లేదు. ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్ కు ఓ పదేళ్లు పడుతుంది అని ఆయన అన్నారు.