కార్యకర్తలు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్ లో కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్ నుంచి జీవధాన్, సాయిబాబా ఆలయం, కొత్త బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా, రైల్వే కమాన్, ఇందిరాచౌక్, ధర్మశాల నుంచి సిరిసిల్ల రోడ్డులో గల రాజిరెడ్డి గార్డెన్ వరకు వందలాది బైకులతో వేలాది మంది కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల ధైర్యం, కార్యకర్తల భిక్షతోనే ఎమ్మెల్యే పదవి లభించిందన్నారు. కార్యకర్తల రుణం జీవితంలో తీర్చుకోలేనన్నారు.
గడిచిన ఎన్నికల్లో ఇద్దరు ముఖ్యమంత్రులపై తనను గెలిపించడంతో రాష్ట్రంలోనే కామారెడ్డి అసెంబ్లీకి ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. అలాగే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం చరిత్రాత్మకంగా నిలవాలన్నారు. లక్ష 20 వేల మెజారిటీతో ఎంపీగా బిబిపాటిల్ గెలుపుకోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బూతు స్థాయి కార్యకర్తలే కీలకం: ఎంపీ అభ్యర్థి బిబిపాటిల్
పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ స్థాయి కార్యకర్తలే కీలకమని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బిబిపాటిల్ అన్నారు. ఒక్కొక్క బూతులో 50 శాతం ఓట్లు బీజేపీకి పడితే గెలుపు ఖాయమని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి పనులకు నిధులు తెచ్చానన్నారు. ఇక్కడ జరిగిన ప్రతి పనిలో కేంద్రం వాటా ఉందన్నారు. ప్రజలంతా బీజేపీ, మోడీ వైపే ఉన్నారని, దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు రావడం ఖాయమని, అందులో జహీరాబాద్ ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు.
తాను ఎంపీగా గెలిస్తే పని చేసే బాధ్యత తనదేనని, కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెస్తానని చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజులు, పైలా కృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి సంధ్యారాణి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కామారెడ్డి