అనంతపురంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నగర పోలీసులను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశించారు. స్థానిక ఎస్డీపీఓ కార్యాలయంలో ఈరోజు నగర పోలీసు అధికారులతో సమావేశమై ఎన్నికల వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన దిశానిర్ధేశం చేశారు. ముందుగా నగర మరియు పోలీసు స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు మరియు క్రిటికల్ పోలింగు స్టేషన్లు, తాజా పరిస్థితులు, తదితరాలపై సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు.
నగరంలో ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ఆటంకపరిచినా, ఓటర్లను ప్రలోభపెట్టినా చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. రౌడీషీటర్లు, సమస్యలు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా వేయాలన్నారు. ఫ్రీ & ఫెయిర్ ఎన్నికలే పోలీసు లక్ష్యమనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. గొడవలు, అల్లర్ల జోలికెళితే చట్టపరంగా పటిష్ట చర్యలుంటాయని కౌన్సెలింగ్ ద్వారా వివరించాలన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టినా… తాయిలాల ఎర చూపి అక్రమాలకు పాల్పడాలనుకున్నా చర్యలు తప్పవని పేర్కొనాలన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, నగర సి.ఐ లు రెడ్డెప్ప, క్రాంతికుమార్, ధరణీకిశోర్, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డిలు పాల్గొన్నారు.