రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ ను అధికారం నుంచి సాగనంపాల్సిన సమయం వచ్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో బాజపా అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడితో పాటు మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కూటమి ముఖ్యనేతలు ఈ సభలో పాల్గొన్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాక.. ఏపీ అభివృద్ధి ఆగిపోయింది..13 లక్షల 50 వేల కోట్ల అప్పును ఏపీపై జగన్ రుద్దారు.. మద్యనిషేధం హామీ ఇచ్చి.. మద్యం సిండికేట్ను జగన్ ప్రోత్సహించారు అంటూ ధర్మవరం సభలో అమిత్ షా విరుచుకుపడ్డారు. కూటమి అభ్యర్థులందరినీ మంచి మెజార్టీతో గెలిపించాలని అమిత్ కోరారు.
‘చంద్రబాబు, మోదీని మళ్లీ గెలిపిస్తే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 25కు 25 ఎంపీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి. అసెంబ్లీలో మూడింట రెండొంతుల సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును సీఎం చేయాలి. రాష్ట్రంలో ధర్మాన్ని గెలిపించేందుకు అందరూ సిద్ధం కావాలి’ అని విజ్ఞప్తి చేశారు. అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దంచుతామని చెప్పారు.
“ఆంధ్రాలో భూ మాపియాను అంతం చేసేందుకు, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డాం. తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడతాం. తెలుగు బాషను రక్షిస్తాం. జగన్ రెడ్డి గుర్తుంచుకో బాజపా ఉన్నంత వరకూ తెలుగు బాషను అంతం కానివ్వం ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా ఉన్న పోలవరానికి జాతీయహోదా ఇవ్వడంలో భాజపా కీలకపాత్ర పోషించింది.
జగన్ అవినీతిలో కూరుకుపోయి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు కేంద్రంలో మోదీ సర్కారు వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తవుతుంది అని ఆయన అన్నారు. మూడోసారి మళ్లీ ప్రధాని అయ్యేది మోదీనే. దేశాన్ని రక్షించేందుకు, ఉగ్రవాదులు, నక్సలైట్లను అరికట్టేందుకు ఆయన్ను మళ్లీ ప్రధానిని చేయాలి. ఉమ్మడి ఏపీని చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిపారు. విభజన తర్వాత కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్లాడు. ఆయన చేసిన అభివృద్ధిని జగన్ ఆరోగతి పట్టించారు. మధ్య నిషేధం చేస్తానని ఇచ్చిన మాట తప్పారు.
మధ్య నిషేధం చేయకపోగా.. సిండికేట్ కు తెరలేపారు. ఆరోగ్యశ్రీకి నిధులివ్వకుండా నిర్వీర్యం చేశారు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా “ఇండియా” కూటమిపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్, రాహుల్ గాంధీ. వీరిలో ఎవరిని చేస్తారో చెప్పాలన్నారు. ఆ కూటమిలో ప్రధాని అభ్యర్ధే లేరని ఎద్దేవా చేశారు.