కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ గోడౌన్ విషయంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అప్పటి ఉమ్మడి కృష్ణా జిల్లా జేసీ మాధవీలత అవినీతికి పాల్పడ్డారని దుగ్గిరాల ప్రభాకర్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కాలపరిమితి ఉన్నా తమ గోదామును అన్యాయంగా మార్చారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించిన తన తల్లి సీతామహాలక్ష్మిని వాసుదేవరెడ్డి అసభ్య పదజాలంతో దూషించారన్నారు.
ఆ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురై ఆమె కొన్ని రోజులకే మరణించారని ప్రభాకర్ అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి ఏపీ బెవరేజెస్ గుడివాడ గోదాము దక్కించుకున్నారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోనగర్లో గోదాము నిర్వహిస్తున్నామని చెప్పారు.
2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. పద్మారెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు రెండేళ్లు కాల పరిమితి ఉన్నా.. కారణం లేకుండా గోదామును మార్చేందుకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ప్రయత్నించాని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, వైకాపా నేత దుక్కిపాటి శశి భూషణ్ ఫోన్లు చేసి తమ కుటుంబాన్ని బెదిరించారని వాపోయారు.