కరీంనగర్ సిగలో కలికితురాయిలా మారనున్న మానేరు రివర్ ప్రంట్ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదే నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలన్న పట్టుదలతో మంత్రి గంగుల కమలాకర్ విశేష కృషి చేస్తున్నారు. మొదటి విడతలో టూరిజం శాఖ చేపట్టనున్న పనులకు సంబంధించిన తుది కసరత్తును పూర్తి చేసారు.
ఈరోజు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి గంగుల కమలాకర్ టూరిజం శాఖ, కన్సల్టెన్సీ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు 100 కోట్ల మేర పనులకు సంబంధించిన టూరిజం తొలి విడత పనులపై అధికారులు మంత్రికి వివరించారు, లోయర్ ప్రామినాడ్, అప్పర్ ప్రామినాడ్ సుందరీకరణ పనుల్లో బాగంగా ప్రామినాడ్ల గ్రానైట్ పనులు, లైటింగ్, స్ట్రీట్ పర్నిచర్, ప్లాంటేషన్, రెయిలింగ్, వాటర్ స్ట్రీమ్లో చేపట్టబోయే వాటర్ పౌంటేన్లు, లేజర్ షో, బోటింగ్ తదితర పనులకు సంబంధించిన వివరాల్ని సమీక్షించారు, ఈ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి గంగుల, పనులకు సంబంధించి పలు సూచనలు చేసారు.
డీపీఆర్ పూర్తయిన పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. ఇదివరకే 308 కోట్ల సివిల్ పనుల కోసం టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్న విషయం విదితమే. అన్ని శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మంత్రి గంగుల వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ఈడీలు శంకర్ రెడ్డి, శ్రీనివాస్, ఐఎన్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధి వంశీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.