ఎన్నికల ఫలితాలు రాబోతున్న తరుణంలో రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాలను కోవడం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యూపీఎస్సీ ఛైర్మన్ కు లేఖ రాశారు. రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్ లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధం అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని చంద్రబాబు అన్నారు.
మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారే. జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదు. సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతలు కట్టబెట్టేందుకు జాబితాను రూపొందించారు అని ఆయన అన్నారు.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో ప్రభుత్వం హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలి. పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాత చేపట్టేలా చూడాలి అని చంద్రబాబు కోరారు. లేఖ కాపీలను పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ , కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా చంద్రబాబు నాయుడు పంపారు.