జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నిక్కచ్చిగా, నిజాయతీగా ఉండే ఆఫీసర్లను రాష్ట్రం నుంచి పంపేశారు. తన అడుగులకు మడుగులొత్తే వారినే తనకు నచ్చిన చోట నియమించుకున్నారు. ఇప్పుడు జగన్ ఘోర ఓటమి తర్వాత పదవిలోకి వచ్చిన చంద్రబాబు సమర్థమైన అధికారులు ఎక్కడ ఉన్నా సరే తిరిగి వెనక్కి రప్పిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉండడంతో చంద్రబాబుకు ఇలాంటి పనులు మరింత సులభం అవుతున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్చంద్ర లడ్హా నియమితులు కానున్నారు. 1998 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన లడ్డా.. ప్రస్తుతం సీఆర్పీఎఫ్ ఐజీగా ఉన్నారు. ఆయన కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ లో ఉండగా.. దాన్ని ముగించుకుని ఒకటిరెండు రోజుల్లో ఏపీకి వచ్చి రిపోర్ట్ చేయనున్నారు.
ఆ తర్వాత ఆయన్ను ఏపీ నిఘా విభాగం అధిపతిగా అపాయింట్ చేస్తూ ఉత్తర్వులు రానున్నాయి. మహేశ్ చంద్ర లడ్డా తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచే డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. గ్రేహౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా మొదటిసారిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన మహేష్ చంద్ర లడ్హా ఆ తర్వాత చింతపల్లి అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆపరేషన్స్ విభాగం ఓఎస్డీగా పని చేశారు. ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఎస్పీగా, హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా కూడా పని చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లో దాదాపు ఐదేళ్ల పాటు ఎస్పీగా, డీఐజీగా కూడా పని చేసిన చరిత్ర ఆయకు ఉంది.
2005లో ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉండగా ఒంగోలు నడిబొడ్డున మావోయిస్టులు క్లెమోర్ మైన్లతో మహేశ్ చంద్ర లడ్డా కారును పేల్చేశారు. అది బుల్లెట్ప్రూఫ్ కావటంతో.. లడ్డా సహా ఆయన ఇద్దరు గన్మెన్లు, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో సామాన్య ప్రజలు ఇద్దరు మృతిచెందారు. నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. ఇలా ఒక అధికారిపై హత్యా యత్నం జరిగిందంటే.. లడ్డా ఎంతగా డ్యూటీ చేశారో అర్థం చేసుకోవచ్చు.
విజయవాడ నగర జాయింట్ పోలీసు కమిషనర్గా, నిఘా విభాగంలో ఐజీగా, విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్గా కూడా మహేశ్ చంద్ర లడ్డా బాధ్యతలు నిర్వర్తించారు. 2019 నుంచి 2020 మధ్య ఏపీ పర్సనల్ విభాగం ఐజీగా పనిచేసి.. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయి సీఆర్పీఎఫ్లో బాధ్యతలు చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగిరానున్నారు. అయితే, జగన్ పై కోడికత్తి దాడి జరిగినప్పుడు విశాఖ సీపీగా ఈయనే ఉన్నారు. జగన్ అధికారంలోకి రాగానే లడ్డా లాంటి ఎందరో ఐపీఎస్ అధికారుల్ని తప్పించారు. నిజాయతీ గల ఆఫీసర్ గా పేరున్న లడ్డా ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే.. ఇక జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు కనపడడం ఖాయమే అని అంటున్నారు.