ఇచ్చిన ప్రతి వాగ్దానం తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలో 7వ వార్డు, 30వ వార్డు, మార్కాపురం మండలంలో దరిమడుగు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 3000 రూపాయలు ఉన్న వృద్ధుల వితంతువుల పెన్షన్లను ఒకేసారి 4000 రూపాయలకు పెంచారు అని గత మూడు నెలల నుండి ఉన్న బకాయిలు మొత్తం కలపి 7వేల రూపాయల మొత్తం ఇప్పుడు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 4000 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ను 6000 రూపాయల కు పెంచి పంపిణీ చేస్తున్నాము.
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మార్కాపురం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అన్ని వార్డులలో పండుగ వాతావరణం లో తెలుగుదేశం నాయకులతో కలిసి సచివాలయం సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.