సీఎం జగన్ బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో హంతకుడు వై ఎస్ అవినాష్ రెడ్డి అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు అభ్యర్ధి వై ఎస్ షర్మిల అన్నారు. కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గం పోరు మామిళ్లలో ఆమె నేడు బహిరంగ సభలో ప్రసంగించారు. వైఎస్ వివేకా ను హత్య చేయించిన వ్యక్తి అవినాష్ రెడ్డి. హత్య జరిగినప్పుడు మాకు కూడా ఈ విషయం తెలియదు. CBI ఆధారాలు చూపించిన తర్వాత నమ్మాల్సి వచ్చింది. అన్ని ఆధారాలు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని చెప్తున్నాయి. రూ. 40 కోట్ల డీల్ మాట్లాడి హత్యకు ప్లాన్ చేశారు. మొబైల్ రికార్డ్స్,గూగుల్ లోకేషన్ లు అన్ని అవినాష్ వైపు చూపించాయి.
అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నాడు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా కర్ఫ్యూ వాతావరణాన్ని జగన్ కర్నూలులో సృష్టించాడు. CBI కి సహకరించకుండా అవినాష్ రెడ్డిని అరెస్టు కాకుండా చూశారు. ఇది అన్యాయం,అధర్మం అని షర్మిల అన్నారు. మళ్ళీ నిందితుడికి ఎంపీ సీట్ ఇవ్వడం అన్యాయం. అన్యాయాన్ని ఎదిరించడానికే పోటీ చేస్తున్నాను. మీరు న్యాయం వైపు ఉంటారా ? అన్యాయం వైపు ఉంటారా ? అని షర్మిల ప్రజలను ప్రశ్నించారు.
ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడు. నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడు. 2.35లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు.. అధికారం అనుభవించి ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. ఇవ్వాళ్టి కి రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాలీగా ఉన్నాయి అని షర్మిల దుమ్మెత్తిపొశారు.